
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సంగెం: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. సంగెంలో పీఏసీఎస్, చింతలపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 మద్దతు ధరతోపాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ రబీలో 68 శాతం సన్న ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగిందని, మొత్తం 50.61 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. మండలంలో 5,670 ఎకరాల్లో సన్న రకం, 630 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారన్నారు. రైతులు 17 శాతం తేమతో నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని తీసుకు రావాలని ఆయన సూచించారు. గన్నీ సంచుల కొరత లేకుండా, కాంటాలు ఆలస్యం కాకుండా లారీలు వచ్చేలా, మిల్లుల వద్ద వెంటవెంటనే ధాన్యం దిగుమతి అయ్యేలా చూడాని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుమారస్వామి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, నోడల్ అధికారి కల్యాణి, ఏఓ యాకయ్య, ఏఈఓ కార్తీక్, ఏపీఎం కిషన్, సొసైటీ సీఈఓ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి