
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
వనపర్తి టౌన్: రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులకు తెలియజేస్తూ వారి కేసులను పరిష్కరించాలని, కక్షిదారులు కోర్టు చుట్టూ తిరగకుండా త్వరగా కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఈ నెల 14న నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు క్రిమినల్, న్యాయవాదులు సివిల్ కేసులను అధిక మొత్తంలో పరిష్కరించాలన్నారు. కేసు పరిష్కారమయ్యే వరకు కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసును పరిష్కరించుకుంటే ఎలాంటి తగాదాలకు తావుండదని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజనీ, సీనియర్ సివిల్ జడ్జి కల్పన, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కవిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీలత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
● ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు.