
వన మహోత్సవ లక్ష్యం 21 లక్షలు
వనపర్తి: ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 21 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్లో మండల అధికారులు పాల్గొనగా వన మహోత్సవంపై దిశా నిర్దేశం చేశారు. లక్ష్య సాధనకు ప్రతి గ్రామం, మండలం, పురపాలికకు సంబంధించి నిర్ధిష్ట ప్రణాళిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ గొప్పగా జరగాలని, రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర పెద్ద మొక్కలు నాటాలని, దీంతో గ్రామానికి కళ వస్తుందన్నారు. ప్రస్తుత ఫొటోలు.. మొక్కలు నాటిన నెల తర్వాత తిరిగి ఫొటోలు తీసి సమర్పించాలని ఎంపీడీఓలు, పుర కమిషనర్లను ఆదేశించారు. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల ప్రాంగణాల్లో మొక్కలతో కంచె వేయాలన్నారు. సాగునీటి కాల్వల వెంట ఖాళీ స్థలాల్లో ఈత, తాటి మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. అన్ని శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించామని.. అందుకు అనుగుణంగా స్థలాలు గుర్తించి మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి టీజీఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాలన్నారు. కోతులు అడవిని వదిలి పల్లెలు, పట్టణాలకు వస్తున్నాయని.. వాటికి ఆహారం దొరికేలా అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు విరివిగా పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని.. అప్పుడే నాటిన మొక్కలు బతికి ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి వన మహోత్సవం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ప్రతి ఇంటికి 5 పండ్ల మొక్కలు పంపిణీ చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, జిల్లా ఇన్చార్జ్ అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
ఇంటింటికి 5 పండ్ల మొక్కలు
కలెక్టర్ ఆదర్శ్ సురభి