
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మండలంలోని బండపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించి మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో భూ సమస్యలను నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తిచేసి అధికారులకు అందజేస్తే పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. 2020లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సాదా బైనామాలను పరిశీలించి పరిష్కరిస్తారని.. మిగిలినవి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో సదస్సు నిర్వహణకు ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఆర్ఐ తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.