
‘ఉపాధి’ కల్పనలో వెనుకబాటు
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాల అమలుతో పాటు ఉపాధిహామీ పనుల కల్పనలోనూ వెనుకంజలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వేతనదారులకు చేతినిండా పనికల్పించడంలో శ్రద్ధ చూపడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. గతేడాది కంటే ఈ ఏడాది వేలాది పనిదినాలు తగ్గడం, వేతనాలు నెలలు తరబడి జమ కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుతో ఉపాధిహామీ పనులకు వెళ్లేందుకు వేతనదారులు ఆసక్తి చూపడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 3.84 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 6.08 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల పనిదినాల లక్ష్యం 1.33 కోట్లు. ఏప్రిల్ 19 నాటికి 9.21 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. గత ఏడాది ఏప్రిల్ 19 నాటికి 10.01 లక్షల పనిదినాలు కల్పించారు. గతేడాది కంటే ఈ ఏడాది 80 వేల పని దినాలు తగ్గిపోయాయి. ఇదే విషయంపై డ్వామా పీడీ ఎస్.శారదాదేవి స్పందిస్తూ పనిదినాల కల్పనలో కాస్త వెనుకబాటు ఉందని, జూన్ నాటికి లక్ష్యం చేరుకుంటామని చెప్పారు.
గతేడాది కంటే తగ్గిన పనిదినాల కల్పన
గతేడాది ఏప్రిల్ 19 నాటికి 10.01 లక్షల పనిదినాల కల్పన
ఈ ఏడాది 9.21లక్షలు మాత్రమే..
గతేడాది కంటే 80 వేలు తక్కువ