
ఐపీఎస్ టు ఐఏఎస్
గంట్యాడ: సివిల్స్ ఫలితాల్లో గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్ సత్తాచూపాడు. హైదరాబాద్లో ఐపీఎస్లో శిక్షణ పొందుతూ సివిల్స్లో 455 ర్యాంక్ సాఽధించారు. ఆయన తల్లి పద్మ గృహణికాగా, తండ్రి విజయనగరం ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నది భార్గవ్కు చిన్నప్పటి నుంచి కోరిక. ఐఏఎస్ అయితేనే అది నెరవేరుతుందని భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికయుతంగా చదివారు. విజయనగరంలో 10వ తరగతి వరకు చదివి, పదోతరగతిలో 567 మార్కులు సాధించారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు చదివి 928 మార్కులు సొంతం చేసుకున్నారు. అనంతరం ముంబయిలోని ఐఐటీలో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 15 నెలలు పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. సమాజంలో ఎక్కువ మందికి సేవచేయగలగాలంటే అది సివిల్స్తో సాధ్యమని నమ్మి పరీక్షకు సిద్ధమయ్యారు. రాత్రీపగలు శ్రమించి గతేడాది సివిల్స్లో 590 ర్యాంక్ సాధించారు. ఐపీఎస్లో చేరారు. ఈ సారి ఏలాగైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సివిల్స్ పరీక్షకు సిద్ధమై 455 ర్యాంకును సాధించారు. ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది
మా అబ్బాయికి సివిల్స్ ఫలితాల్లో 455 ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. దానికి అనుగుణంగా మా అబ్బాయిని ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మా నమ్మాకాన్ని నిలబెట్టాడు.
– పొటుపురెడ్డి పద్మ, సత్యం,
భార్గవ్ తల్లిదండ్రులు