గుర్ల: ప్రజలకు మంచి జరగాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గుర్ల మండలంలోని రాగోలులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు మంచి చేయడంతో పాటు మహిళలకు గౌరవం పెంచామని చెప్పారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేశామని ప్రజలకు తెలియజేశారు. రాగోలు గ్రామంలో ఐదేళ్లలో రూ.ఐదు కోట్ల 40 లక్షల నగదను సంక్షేమ పథకాల ద్వారా అందించామని చెప్పారు. సంక్షేమ పథకాలను ఎటువంటి దళారులు, లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామాలకు టీడీపీ నాయకులు వచ్చి లేనిపోని హమీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడతారని వాటిని నమ్మవద్దని సూచించారు. మేలు చేసిన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు.
ఎంపీ, ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలి
ప్రచారంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మంచి వల్ల పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. డబ్బు మూటలు ఉన్న నాయకుడి గురించి టీడీపీ నాయకులు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో చీపురుపల్లి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారని వారిద్దరికీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే తపన జగన్మోహన్ రెడ్డికి ఉండడంతో పేదలందరూ గౌరవంగా ఉన్నారన్నారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగితేనే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు, వైఎస్సార్సీపీ యువ నాయకుడు బొత్స సందీప్, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు, జేసీఎస్ కన్వీనర్లు బెల్లాన బంగారునాయుడు, కెంగువ మధుసూదనరావు, సర్పంచ్ చందక బంగారునాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.