
ఐఐఎంవీలో ‘ఈపీజీడీపీఎం’ ప్రారంభం
తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నం(ఐఐఎంవీ)లో రక్షణ రంగ అధికారులు, కార్యనిర్వాహకుల కోసం ఏడాది పాటు నిర్వహించే ‘ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఈపీజీడీపీఎం)’శనివారం ప్రారంభమైంది. హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశ్రాంత సీఎండీ హేమంత్ ఖత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ మౌలిక వసతులు, వందే భారత్ వంటి ఆవిష్కరణలు, 6జీ టెక్నాలజీ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ నాయకత్వ పాత్రను కొనియాడారు. విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధస్సు, అనుకూలత, సృజనాత్మక సమస్య పరిష్కార సామర్థ్యాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ డైనమిక్, టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ సిబ్బందిని సిద్ధం చేయడానికి ఈ కోర్సును రూపొందించినట్లు చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ ప్రేమ్కుమార్ నాయర్ మాట్లాడుతూ ఈ బ్యాచ్లో సగటు వయసు 38 సంవత్సరాలు కాగా.. 13 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రోగ్రాం చైర్ ప్రొ.శ్రీరంగాచార్యులు మాట్లాడుతూ ఈ కోర్సు మాడ్యులర్ ఎంబీఏగా హైబ్రిడ్ ఫార్మాట్లో రూపొందించినట్లు చెప్పారు. డీన్ కావేరీ కృష్ణన్ మాట్లాడారు.