
పర్యావరణ హితమే ప్రధానం
బీచ్రోడ్డు: పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, భూమి పొరలను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకంపై నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇస్కాఫ్, గ్లోబల్ నెట్వర్క్, సోషల్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జె.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పేరుతో వినాశకర వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందని, దీని వల్ల మానవాళి సంవత్సరాల తరబడి వైకల్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందన్నారు. ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అని అన్నారు. మలయాళీ వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ జోషి, గ్లోబల్ నెట్వర్క్ ప్రతినిధి రామ్ ప్రభు, బస్ పోతన, వై.సత్యవతి తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణలో ప్రజలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు.