
ఇంజనీరింగ్ లీలలు!
● వీఎంఆర్డీఏ టెండర్లలో నిబంధనలకు తిలోదకాలు ● కూటమి నేతల లబ్ధికి అధికారుల తాపత్రయం ● ‘ది డెక్’ నిర్వహణకుసింగిల్ టెండర్.. అయినా ఓకే ● సీ హారియర్ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థకు చెక్ ● తమ వారికి దక్కలేదని టెండర్ రద్దు
విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) ఇంజనీరింగ్ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తూ కూటమి ప్రజాప్రతినిధుల అనుచరులకు టెండర్లు కట్టబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా టెండర్లలో రూల్స్ మార్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా టెండర్ వేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్ చేయడం.. తాజాగా వేరొక కాంట్రాక్టు సంస్థకు ఆ టెండర్ దక్కిందన్న అక్కసుతో దాన్ని రద్దు చేయడంపై దుమారం రేగుతోంది. అలాగే మరో నిర్వహణ పనులకు ఒకే టెండర్ దాఖలైనప్పటికీ.. వారికి కేటాయించడంతో ఇతర కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు.
సీ హారియర్ టెండర్ రద్దు
బీచ్ రోడ్డులోని సీ హారియర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణ టెండర్ను అనుకున్నట్లుగానే అధికారులు రద్దు చేశారు. మ్యూజియం నిర్వహణ కోసం 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రిల్లో వీఎంఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ నిర్వహణ పనిలో భారీగా ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో ఒక కాంట్రాక్టు సంస్థ అధికారులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ఈ మ్యూజియం టెండర్లో పాల్గొనవద్దని స్వయంగా ఇంజనీరింగ్ అధికారులే కాంట్రాక్ట్ సంస్థలకు చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయినప్పటికీ పలువురు ఇతర పేర్ల మీద టెండర్లు దాఖలు చేశారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ.29,48,036కు ఒక సంస్థ టెండర్ వేసింది. ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. వాస్తవానికి తక్కువకు టెండర్ వేసిన సంస్థకే పనులను అప్పగించాలి. కానీ ఇంజనీరింగ్ అధికారులు రెండో స్థానంలో ఉన్న సంస్థకు పనులు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సంస్థ తక్కువకు టెండర్ వేయకపోవడంతో వారి ఆశలు నిరాశయ్యాయి. దీంతో ఈ టెండర్ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించినప్పకీ అది ఫలించనట్లు సమాచారం. ఫలితంగా తక్కువకు టెండర్ వేసిన కాంట్రాక్టు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే ఈ టెండర్ను అధికారులు రద్దు చేశారు. అర్హత సాధించిన సంస్థ నిర్వాహకులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
సింగిల్ టెండర్కే ఆమోదం
సిరిపురం జంక్షన్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ను వీఎంఆర్డీఏ నిర్మించింది. త్వరలోనే ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవన నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1.33 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు అనేక కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపించాయి. కానీ ఈ పనులపై కూటమి ప్రజాప్రతినిధి కన్నేశారు. తమ అనుచరులకు ఈ టెండర్ను కట్టబెట్టేందుకు చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సదరు సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చివేశారు. అంతేకాకుండా ఈ టెండర్ విషయంలో కూడా ఎవరూ దరఖాస్తులు దాఖలు చేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టును ఇప్పటికే వీఎంఆర్డీఏలో మూడు భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థకే కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పనులకు కేవలం ఒక టెండర్ మాత్రమే దాఖలైంది. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ను తిరస్కరించాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు ఈ నిబంధన అమలు విషయంలో వింత భాష్యం చెపుతున్నట్లు సమాచారం. గ్లోబల్ టెండర్ల ద్వారా ఏ సంస్థ వచ్చినా ఆ భవనం నిర్వహణ అంత తేలికై న విషయం కాదని, అందుకే ఇక్కడి సంస్థకే అప్పగిస్తే నిర్వహణ బాగుంటుందని చెప్పి సింగిల్ టెండర్ వేసిన సంస్థకే పనులు అప్పగించడం విశేషం. దీనిపై ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీని వెనుక స్థానిక కూటమి ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతోనే ఎవరూ ది డెక్ టెండర్పై నోరెత్తలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది.