
టెన్షన్.. టెన్షన్!
● ఓ పక్క బదిలీలు, మరో పక్క పదోన్నతులు ● 86 మంది గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు ● 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి ● సాంకేతిక చిక్కులతో రోస్టర్ కూర్పులో జాప్యం ● ఎస్ఏ, ఎస్జీటీల బదిలీలకు సిద్ధమైన సీనియార్టీ జాబితాలు
విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల పర్వం మొదలైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 86 మందికి స్థానచలనం కలిగింది. వెబ్ ఆప్షన్స్లో హెచ్ఎంలు కోరుకున్న పాఠశాలల్ని కేటాయిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీల షెడ్యూల్లో భాగంగా గురువారం జిల్లా విద్యాశాఖాధికారులు స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–1 పరిధిలోకి వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ పరిధిలోని 66 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు దక్కాయి. ఆర్జేడీ బి.విజయభాస్కర్, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్లు అంతా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఈ నెల 31న రిలీవ్ అయి, 1న హెచ్ఎంగా బాధ్యతలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు.
సాంకేతిక చిక్కులతో జాప్యం
గ్రేడ్–2 హెచ్ఎం ప్రమోషన్స్ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులంతా విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్కు గురువారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కౌన్సెలింగ్ మాత్రం సాయంత్రం 6 తర్వాత ప్రారంభమై, రాత్రి 10 వరకు కొనసాగింది. జిల్లా విద్యాశాఖాధికారులు సీనియార్టీ జాబితా సిద్ధం చేసినప్పటికీ, కమిషనరేట్ నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రమోషన్స్ కౌన్సెలింగ్కు గ్రీన్సిగ్నల్ రాలేదు. పదోన్నతుల రోస్టర్ కూర్పుపై కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా దీనిపై కమిషనరేట్ నుంచి సకాలంలో ఆమోదం లభించకపోవటంతో ఇక్కడి అధికారులు నిరీక్షించక తప్పలేదు.
సిద్ధమైన ఎస్ఏ, ఎస్జీటీల జాబితాలు
స్కూల్ అసిస్టెంట్, సెకడరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీలు భారీగానే ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులను ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో వడపోతను ముమ్మరం చేస్తున్నారు. షెడ్యూల్ మేరకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులిస్తారు. అనంతరం ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు.
పుట్టెడు దుఃఖంలోనూ..
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అంతా ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా విశాఖ డీఈవో ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయన మామయ్య తీవ్ర అనారోగ్యంతో వారం రోజులుగా చైన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. సమచారం తెలిశాక పుట్టెడు దుఃఖంలోనూ ప్రమోషన్స్, బదిలీలపై ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి, ఉన్నతాధికారుల అనుమతితో అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారు.

టెన్షన్.. టెన్షన్!