
దిగుబడి బాగు.. ధర దిగాలు!
● మామిడి పళ్లతో కళకళలాడుతున్న మార్కెట్లు ● విశాఖ జిల్లా వ్యాప్తంగా 27 వేల హెక్టార్లలో మామిడి తోటలు ● ఈ ఏడాది హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి ● రైతుబజార్లలో కిలో మామిడి పళ్ల సగటు ధర రూ.45
పెందుర్తి: విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాల కలయికే మామిడి పండు.. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. అందుకే మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. రంగు, రుచి, సువాసనలతో మనల్ని ముగ్ధులను చేస్తుంది. జిల్లాలో ఈ ఏడాది మామిడి సీజన్ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లు మామిడి సువాసనలతో నిండిపోయాయి. రైతులు, వ్యాపారులు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో మామిడి దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలో మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన పద్మనాభంతో పాటు ఆనందపురం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లో పంట పూర్తిస్థాయిలో పక్వానికి వచ్చింది. రైతులు ఇప్పటికే మామిడి కాయలను దించి విక్రయాలు సాగిస్తున్నారు. అయితే, దిగుబడి పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టుగా ధరలు పలకకపోవడంతో మామిడి రైతులు కొంత నిరాశలో ఉన్న మాట వాస్తవం. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు, పంచదార కంచెలు, పండూరి, కలెక్టర్, కొబ్బరి మామిడి, పనుకూలు, కోలంగోవ, పరియా, నీలాలు వంటి వివిధ రకాల మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారు.
ఎకరాకు సగటున 4 టన్నులు
జిల్లాలోని గ్రామీణ మండలాలైన పద్మనాభం, ఆనందపురం, భీమిలి, పెందుర్తిలలో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 27 వేల హెక్టార్లలో(దాదాపు 67 వేల ఎకరాలు) మామిడి పండింది. డిసెంబర్, జనవరిలో పూత దశలో పొగమంచు ప్రభావం, రెండు మూడు తుఫాన్ల కారణంగా సుమారు 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. అయినప్పటికీ రైతులకు 40–45 శాతం ఫలసాయం దక్కింది. ఇది ఏటా వచ్చే సగటు ఫలసాయంతో పోలిస్తే మెరుగైన దిగుబడే. సీజన్ ముగిసే సమయానికి హెక్టార్కు సగటున 10 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో మామిడి ధర రూ.50–60 పలుకుతుండగా.. రైతుబజార్లలో సగటున రూ.45గా నిర్ణయించారు. కొందరు రైతులు నిర్ణయించిన ధర కంటే రూ.5–10 తక్కువకే విక్రయిస్తున్నారు.

దిగుబడి బాగు.. ధర దిగాలు!

దిగుబడి బాగు.. ధర దిగాలు!