
పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు
సీతంపేట: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో విశాఖ అభివృద్ధికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిచ్చారని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేశారని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. పార్టీ అనుబంధ కమిటీల నియామకంపై చేస్తున్న కసరత్తుల్లో భాగంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో కూడా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. విశాఖకు జగన్, వైఎస్సార్ ఎటువంటి మేలు చేశారు.. చంద్రబాబు ఏం చేశారనే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండి, నిజంగా కష్టపడుతున్న వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. వారి ద్వారానే పార్టీకి భవిష్యత్తులో మేలు జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.
విశాఖకు అడుగడుగునా అన్యాయం
2014 ఎన్నికల్లో విశాఖను సౌత్ ఇండియాకు గేట్వేగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక కేవలం అమరావతిపై ప్రేమతో విశాఖపై సవతి ప్రేమ చూపించారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే.. తప్పుడు ప్రచారాలు, కేసులతో దానిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ 2024 ఎన్నికల సమయంలో అదే తరహా హామీలిచ్చి, అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని పేపర్లకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామన్నారు. 2014 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ కోసం ఎంతో మంది కష్టపడ్డారని, అయితే ఎన్నికలు వచ్చే సరికి కొంత మంది న్యూట్రల్ అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా వైఎస్సార్సీపీ నా పార్టీ అన్న భావనతో, ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుని పనిచేసే కార్యకర్తలు, నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.