
ఉత్సాహంగా రైల్వే వేసవి క్రీడా శిబిరాలు
విశాఖ స్పోర్ట్స్: యువ ప్రతిభను పెంపొందించడం, క్రీడాస్ఫూర్తిని చిరుప్రాయం నుంచే అలవరిచే లక్ష్యంతో రైల్వేలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రీడా సంఘం(ఈకోర్సా) వాల్తేర్ ఆధ్వర్యంలో ఈనెల 22న ప్రారంభమైన క్రీడా శిబిరాలు నెలాఖరు వరకూ సాగనున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులు సుమారు 200 మంది ఈ శిబిరాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇదిలా వుండగా ఆదివారం ఈకోర్సా డబ్ల్యూడబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్న్స బోహ్రా మార్గదర్శకంలో యోగా శిబిరంలో మరింత ఉత్సాహంగా సాగింది. యువతలో ఆరోగ్యకరమైన అలవాట్లు, మానసిక శ్రేయస్సును పెంపొందించడం లక్ష్యంగా యోగాతో పాటు స్విమ్మింగ్లోనూ శిక్షణ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రెండు సెషన్స్లో ఈ శిబిరం ప్రతీ రోజూ జరుగుతుంది. బాలురకు క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్లో శిక్షణ ఇస్తుండగా బాక్సింగ్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగాలో బాలబాలికలు శిక్షణ నిర్వహిస్తున్నారు.