
ఆప్తాల్మిక్ అధికారులకు పదోన్నతులు కల్పించాలి
అల్లిపురం: రాష్ట్రంలోని ఆప్తాల్మిక్ అధికారులు గత 39 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతులకు నోచుకోకుండానే.. పదవీ విరమణ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఆప్తాల్మిక్ అధికారుల అసోసియేషన్ జోన్–1 అధ్యక్షుడు డి.వెంకటరమణ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని ఎన్జీవో హోం ఆవరణలో ఆదివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పదోన్నతులపై తక్షణమే స్పందించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క ఉద్యోగికి కనీసం రెండు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జె.రఘురామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్.వసంతరావు, ఎం.ఆర్.కె.దాస్, జోనల్ అధ్యక్షుడు డి.వెంకటరావు, జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు పాల్గొని.. ఈ నెల పదవీ విరమణ చేయనున్న బీవీఎం ప్రసాద్ను సన్మానించారు.