
● గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతున్న వితంతువులు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభత్వుం అధికారం చేపట్టిన తర్వాత కొత్త పింఛన్లకు మంగళం పాడేసింది. గత ఏడాది జూన్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు జిల్లాలో 2,71,183 మందికి అందించగా.. ఈ ఏడాది జూన్లో 2,60,379 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారు. కూటమి ఏడాది పాలనలో జిల్లాలో 10,804 పింఛన్లు తగ్గించారు. ప్రతి నెలా వెయ్యి పింఛన్లు తగ్గిస్తున్నారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నిస్తే...పింఛన్లు తగ్గించలేదని వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. తొలగించిన వారి జాబితా ఇవ్వడానికి అధికారులు విముఖత చూపుతున్నారు.
నేడు, రేపు పింఛన్ల తనిఖీల జాబితా విడుదల
కూటమి ఏడాది పాలనలో 10,804 మందికి పింఛన్లు తగ్గించారు. మరోవైపు జిల్లాలో గత ఆరు నెలలుగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. వీరి జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ జాబితా వస్తే అందులో ఎంత మందిని తొలగిస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు రూ.4 వేలు ఫించన్ తీసుకుంటున్న వారిని జూన్ రెండో వారం నుంచి తనిఖీలు చేయనున్నారు.
స్పౌజ్ పింఛన్లకు కొత్త మెలిక
స్పౌజ్ కేటగిరిలో వితంతువులకు పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఏ కేటగిరిలోనైనా పింఛన్లు తీసుకుంటున్న భర్త మృతి చెందితే మాత్రమే వారి సతీమణులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆ మేరకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మృతి చెందిన పింఛన్దారుల భార్యలకు 3,940 పింఛన్లు మంజూరు చేశారు. వాటిని వెరిఫికేషన్ చేస్తున్నారు. అందులో 1,500 పింఛన్లు సర్వర్ సమస్యలతో గుర్తించలేకపోతున్నామని చెబుతున్నారు. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వితంతువులై పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు 6,500 మందికి పైగా ఉన్నట్లు అధికారుల వద్ద లెక్కలున్నాయి.
50 ఏళ్లకే పింఛన్ ఎక్కడా?
జిల్లాలో ప్రస్తుతం జూన్లో 2,60,379 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ ఉసేలేదు. 50 ఏళ్లు పైబడి పింఛన్లకు అర్హులైన వారు జిల్లాలో 70 వేల మందికి పైగానే ఉన్నారు. మరోవైపు 60 ఏళ్లు దాటి పింఛన్లకు అర్హులైన వారు, వితంతువులు, కళాకారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ వ్యాధిగ్రస్తులు మరో 30 వేల మంది వరకు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది.
వితంతు పింఛన్ కోసం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అభాగ్యులు (ఫైల్)
ఈ తగ్గించిన
ఏడాది పింఛన్లు
జనవరి 641
పిభ్రవరి 804
మార్చి 730
ఏప్రిల్ 620
మే 611
జూన్ 851
పింఛన్లు తొలగించలేదు
ఏడాది కాలంలో పింఛన్లు మేము తొలగించలేదు. అందులో చాలా మంది మృతి చెందారు. పలువురు వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోలేదు. దీంతోనే ఆ పింఛన్లు తగ్గాయి. మే నెలకు సంబంధించి పింఛన్లు 2,60,379 మందికి ఈ నెల 31 నుంచి అందిస్తాం.
–టీఎన్ శోభన్బాబు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్