
పేదల సేవకే ప్రాధాన్యం
తిరుపతి అర్బన్ : పేదల సేవకే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. రుయా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్, ఎక్విప్మెంట్పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన వస్తువులు, పరికరాలను తీసుకురావడంతో బాధ్యత తీరిపోయినట్లు కాదని, వాటిని పేదల కోసం సక్రమంగా వినియోగించినప్పుడే విజయవంతమైనట్లు భావించాలని సూచించారు. రుయా ఆస్పత్రికి ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. సిటీ డయాగ్నొస్టిర్ సెంటర్లో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నిత్యం వచ్చే రోగులకు అవసరం అయిన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రుయా సూపరింటెండెంట్ రాధ, డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రవి ప్రభు పాల్గొన్నారు.
యోగాంధ్ర నిర్వహణకు పటిష్ట చర్యలు
తిరుపతి అర్బన్: యోగాంధ్ర నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే థీమ్ స్ఫూర్తితో జూన్ 21 వరకు యోగ మాసంగా పరిగణించాలన్నారు. ఆ మేరకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.