
హాంఫట్!
మఠం భూములు..
● బరితెగించిన కబ్జాదారులు ● మాయమవుతున్న మఠం భూములు ● గాంధీపురంలో రూ.4 కోట్ల విలువైన మఠం భూమి కబ్జా ● భూ మాఫియాకు భయపడుతున్న మఠం అధికారులు ● ఆక్రమణల తొలగింపునకు సహకరించని రెవెన్యూ, పోలీసు శాఖలు ● అధికార పార్టీ అండతో చెలరేగుతున్న ఆక్రమణదారులు
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి శివారు ప్రాంతాల్లోని హథీరాంజీ మఠం భూములు కబ్జాదారుల చేతుల్లో పడి మాయమై పోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే ఖాళీగా ఉన్న మఠం భూములు, వివాదాస్పద భూములను గుర్తించిన తెలుగు తమ్ముళ్లు వాటిపై గద్దల్లా వాలిపోతున్నారు. బలహీనులైన పేదల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారు. పేదలను భయపెట్టి అనధికారిక పత్రాల్లో సంతకాలు చేయించుకుని కొట్టేస్తున్నారు. విలువైన భూములు కాజేస్తున్నా మఠం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నం.13లోని మఠం భూమిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కబ్జాచేసినట్టు సమాచారం. ఆన్లైన్లో ఆ మొత్తం భూమి మఠం భూమిగా ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే శ్రీవారిపై భక్తితో భక్తులు కానుకగా అందజేసిన భూములు అవి. కానీ కబ్జా రాయుళ్లు పట్టపగలు అడ్డగోలుగా కట్టడాలు కడుతున్నారు. బోర్లు వేసి పక్కాగా కట్టడాలు నిర్మిస్తున్నారు. కబ్జాదారులు ఆక్రమించిన ప్రదేశంలో ఒక అంకణం విలువ సుమారు రూ.2 లక్షలు పలుకుతోందని సమాచారం. ఆ లెక్కన 200 అంకణాల వరకు ఆక్రమించిన భూమి విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
మఠం అధికారులు స్పందించరెందుకో?
వేల కోట్ల విలువైన మఠం భూములను కాపాడడంలో హథీరాంజీ మఠం అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు గాంధీపురం వాసులు ఆరోపిస్తున్నారు. ఆక్రమిత మఠం భూముల్లో అనధికారిక నిర్మాణాలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుని కోట్ల విలువైన మఠం భూములను కాపాడడంతో పాటు నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. మఠం భూముల్లో యధేచ్ఛగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించాలని, వరుసగా భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపాలని సూచిస్తున్నారు.
మాకు సహకరిస్తే ఆక్రమణలు తొలగిస్తాం
హథీరాంజీ మఠం భూములను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అక్కడకు వెళితే కబ్జాదారులు మాపైకి మారణాయుధాలతో దాడులు చేస్తున్నారు. గతంలో పలుమార్లు మాపై దాడులు జరిగాయి. అందుకే మఠం భూముల్లో ఆక్రమణల తొలగింపునకు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వే నంబరు 13తో పాటు ఆ చుట్టు పక్కల 175 ఎకరాల భూమి మఠానికి చెందినదే. అక్కడ ఎవ్వరికీ ఎలాంటి హక్కూ లేదు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సహకరిస్తే అక్కడి ఆక్రమణలను తొలగించేస్తాం.
–కేశవులు, సూపరింటెండెంట్, హథీరాంజీ మఠం కార్యాలయం
మఠం భూములు మటుమాయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారులు మఠం భూములపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది కబ్జారాయుళ్లు మఠం భూములపై నకిలీ పత్రాలు సృష్టించుకుని న్యాయస్థానాల్లో కేసులు వేసి పోరాడం చేస్తుండగా.. మరికొంత మంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని మఠం భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నట్టు సమాచారం. తరతరాలుగా మఠం భూములను సాగుచేసుకుని తమ ఆధీనంలో పెట్టుకున్న వారిపట్ల కబ్జాదారులు విరుచుకుపడుతుండడంతో అటువైపు వెళ్లలేక, అక్రమ కట్టడాలను ఆపలేక లోలోపల కుమిలిపోతున్నారు. పోలీసులు, మఠం అధికారులు, రెవెన్యూ అధికాారులు ఎవ్వరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోవాల్సి వస్తోందని గాంధీపురం వాసులు గగ్గోలు పెడుతున్నారు.