
వేడుకగా అవతారోత్సవాలు
తిరుపతి కల్చరల్: భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయులు భగవద్ రామానుజాచార్యులని తిరుమల చిన్నజీయర్స్వామి కొనియాడారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తలపెట్టిన శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాలు బుధవారం అన్నమాచార్య కళామందిరంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. చిన్నజీయర్స్వామి హాజరై మంగళశాసనంతో అవతార మహోత్సవాలకు శ్రీకా రం చుట్టారు. ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ అదిశేషుని అవతారమైన రామానుజులవారు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారన్నారు. భక్తితో భగవంతుని కొలిస్తే దివ్యత్వం కలుగుతుందని వెల్లడించారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, రామానుజాచార్యులు ఈ మార్గమే అనుసరించారని వివరించారు. అనంతరం అహోబిలం మళానికి చెందిన సీతారామన్ మాట్లాడుతూ ‘శ్రీరామానుజ వైభవాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులకు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి రాజగోపాలరావు, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ పురుషోత్తం పాల్గొన్నారు.