
బెంగళూరులో ఉడుమలై ఇంజినీర్ మృతి
సాక్షి, చైన్నె: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఉడుమలైకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని గురువారం మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, ఆప్తులు శోక సంద్రంలో మునిగారు. ఐపీఎల్ టోర్నీని 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు చిన్నస్వామి మైదానంలో జరిగిన విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన స్టాఫ్ట్వేర్ ఇంజినీరు కూడా బలి అయ్యారు.
విషాదంలో కుటుంబం
తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో వివేకానంద విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్గా మూర్తి (65) వ్యవహరిస్తున్నారు. మూర్తి, ఆయన భార్య రాజలక్ష్మి(60) ఈ విద్యాసంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తె కామాక్షి దేవి(27) ఐదేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. స్నేహితులతో కలిసి కామాక్షి దేవి బెంగళూరు స్టేడియానికి వెళ్లి తొక్కిసలాటలో మరణించారు. కామాక్షి దేవి మరణ సమాచారంతో కుటుంబ సభ్యులు, ఆప్తులు తీవ్ర విషాదంలో మునిగారు. ఆమె మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం 2 గంటల అంబులెనన్స్లో ఉడుమలైపేటకు తీసుకొచ్చారు. ఆమె మృత దేహానికి వివేకానంద విద్యాలయ పాఠశాలలో ఉంచారు. ఏకై క కుమార్తెను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది. తమకు వయస్సు మీద పడడంతో ఇక, విద్యాసంస్థను నడిపించాలని కుమార్తెకు మూర్తి ఇటీవల సూచించినట్టు ఆప్తులు చెబుతున్నారు. త్వరలో బాధ్యతలు చేపడతానని చెప్పుకుంటూ వచ్చిన కామాక్షి దేవి కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. కాగా, ఈ విషాదంలో బెంగళూరులో ఉంటున్న తమిళులు అక్షిత అనే మహిళతో పాటుగా ఓ బాలిక సైతం మరణించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.