
ధనుష్ చిత్రం కోసం 15 ఎకరాల్లో భారీ సెట్
తమిళసినిమా : కథానాయకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా తమిళంలోనైనా, తెలుగులోనైనా, హిందీలోనైనా తగ్గేదేలేదంటున్నారు నటుడు ధనుష్. ఇలా బహుభాషా నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం మంచి యూత్పుల్ లవ్ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం హిందీలో తేరే ఇష్క్ మెయిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో హీరోగా నటించిన కుబేర చిత్రం జూన్ 20వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా మరిన్ని నూతన చిత్రాలు ఈయన కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో నిర్మాత ఐసరి గణేశ్ నిర్మించనున్న రెండు చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఈయన వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ధనుష్ హీరోగా నిర్మించినున్న ఒక చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. మరో చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వార్తే ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్లోనే ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్ర షూటింగ్కు సంబంధించిన సెట్ వేయడంలో ఆలస్యం కావడంతో షూటింగ్ జూన్ నెలకు వాయిదా పడిందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి అరువడై అనే టైటిల్ను నిర్ణయించినట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కోసం చైన్నెలోని ఈవీపీ నగర్లో ఐసరి గణేశ్కు చెందిన 15 ఎకరాల స్థలంలో భారీ సెట్ను వేస్తున్నారట. ఈ సెట్లోనే అధిక భాగం షూటింగ్ను నిర్వహించడానికి ప్రణాళికను రచించినట్లు సమాచారం. కాగా ఇందులో ధనుష్కు జంటగా నటించే కథానాయకి, ఇతర నటీనటులు,సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.