పత్తి కొనుగోళ్లు బంద్!
మొదటినుంచి కొర్రీలే..
భానుపురి (సూర్యాపేట) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరుసగా తీసుకొస్తున్న నిబంధనలు, కొర్రీల కారణంగా మిల్లర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు, ప్రభుత్వం, సీసీఐ అధికారుల నడుమ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగి.. ఇటీవలే సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు జరుపుతున్నారు. తాజాగా ఎకరానికి 7 క్వింటాల పత్తి దిగుమతి, తేమ శాతంలో కొర్రీల కారణంగా నెలకొంటున్న ఇబ్బందుల దృష్ట్యా నిబంధనలు సడలించాలన్న మిల్లర్ల విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మిల్లర్ల అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అధికార యంత్రాంగం రైతన్నలను అప్రమత్తం చేసి.. నేటినుంచి అమ్మకానికి రావొద్దంటూ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రకటనలు విడుదల చేసింది.
6వ తేదీ నుంచే బంద్కు పిలుపు..!
వీటికి తోడు జిల్లాలోని అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఒకేసారి తెరవకుండా దశలవారీగా తెరవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలుగా ఏర్పాటు చేయగా.. వీటిని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4, ఎల్ 5, ఎల్ 6గా విభజించారు. ఇందులో ప్రస్తుతం ఎల్ 1, ఎల్ 2గా ఉన్న సూర్యాపేట సమీపంలోని బాలెంల, తిరుమలగిరి సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో కొనుగోలు సామర్థ్య పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ సీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాటన్ మిల్లు యాజమాన్యాలకు పత్తి రైతులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. వాస్తవంగా ఈనెల 6 నుంచే కొనుగోళ్లు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటిస్తే బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి అందుబాటులో లేరని, కొద్దీ సమయం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో తమ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా వీరి ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతూ కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ తీరును సరిదిద్ది పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చూడాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఫ నేటినుంచి మూతపడనున్న
సీసీఐ కేంద్రాలు
ఫ సీసీఐ నిబంధనలు
సడలించే వరకూ ఇదే పరిస్థితి
ఫ కొర్రీలతో కాటన్ మిల్లర్ల
అసోసియేషన్ నిర్ణయం
ఫ అమ్మకానికి పత్తిని
తీసుకు రావొద్దని అధికారుల ప్రకటన
జిల్లాలో 2025–26 సీజన్లో సుమారుగా 93వేల ఎకరాల్లో పత్తి సాగైంది. తుపాన్ కారణంగా కొంత పత్తి తడిసినా.. ఎక్కడా నష్టం వాటిల్లలేదు. దిగుబడి బాగానే రావడంతో రైతులు మద్దతు ధర ఒక్కటీ వస్తే లాభపడతామని సంబురపడ్డారు. ఈ తరుణంలో సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో మొదటినుంచి కొర్రీలు పెడుతూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నిబంధనలతో ఓ వైపు రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లకు కొత్తగా కపాస్ యాప్ పెట్టి అందులో నమోదైన రైతుల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇందుకు కొంత సమయం పట్టడంతో ఆలస్యంగా సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. అటు తర్వాత రైతులు ముందుగా స్లాట్బుక్ చేసుకుంటేనే.. కొనుగోలు చేస్తామని, అదీ ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామన్న మరో కఠిన నిబంధన అమలులోకి తెచ్చారు.


