
గ్రామంలోనే భూ సమస్యల పరిష్కారం
మోతె : గ్రామంలోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం మోతె మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం–2025 అవగాహన సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ధరణిలో చాలా సమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు ఆందోళనలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధరణిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, 18 రాష్ట్రాలలో పరిశీలించి, నిపుణులు, మేధావులు, అధికారుల సూచనలు తీసుకొని ఈ భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారన్నారు. తర్వాత ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో అమలు చేసి, జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ మామిడి తోరణాలతో పండుగ వాతావరణంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దారు శ్రీకాంత్ పీపీటీ ద్వారా భూ భారతి చట్టం గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్, ఎంపీడీఓ ఆంజనేయులు, జలసాధన కమిటీ ఫౌండర్ దుశ్చర్ల సత్యనారాయణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్