
తీరని కషా్టలు
వడువని వడ్లు..
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వసతులు కల్పించలేదు. ఏ సెంటర్లోనూ రైతులకు నిలువ నీడ లేకుండా పోయింది. కేవలం చెట్ల నీడనే సేదదీరే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల తాగునీటి వసతి లేక వేసవిలో మండుతున్న ఎండలకు దాహార్తి తీర్చుకోవడానికి రైతులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. వీటితో పాటు టార్పాలిన్లు లేకపోవడంతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతోంది. గన్నీ బ్యాగులు, సరైన రవాణా సదుపాయంలేక కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి.
4.07 లక్షల మెట్రిక్ టన్నలే లక్ష్యంగా..
జిల్లాలో యాసంగి సీజన్లో అత్యధికంగా వరి సాగైంది. దొడ్డురకమే కాకుండా సన్నరకాలను రైతులు సాగు చేశారు. దాదాపు 4.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. రైతులు అవసరాలు, విత్తనాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా చివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను 286 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా మందకొడిగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. తేమ పేరుతో చాలాచోట్ల కాంటాలను నెమ్మదిగా వేస్తున్నారు. మరికొన్నిచోట్ల గన్నీబ్యాగుల కొరత, రవాణా సదుపాయం లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది.
అసౌకర్యాలతో ఇబ్బందులు..
ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కరెంటు, టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు, టెంట్ సౌకర్యం ఉండాల్సి ఉంది. అయితే జిల్లాలోని 286 సెంటర్లకు గాను ఏ సెంటర్లోనూ కనీస సౌకర్యాలను నిర్వాహకులకు కల్పించడం లేదు. చాలాచోట్ల నీడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టెంట్ కూడా వేయకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల నీడన ధాన్యం ఆరబోయడం, రాశి చేసేందుకు వచ్చి అలసిపోయిన రైతులు ఉంటున్నారు. కేవలం సెంటర్ల నిర్వాహకులు ఉండేలా చిన్నపాటి టెంట్ మాత్రమే వేస్తున్నారు. ఇక మంచినీళ్లు సైతం చాలా సెంటర్లలో అందుబాటులో ఉండడం లేదు. అలాగే టార్పాలిన్లు ఒక్క సెంటర్లోనూ అందుబాటులో లేవు. రైతులే స్వయంగా కొనుగోలు చేసి తమ పంటను కాపాడుకుంటున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉన్నా అకాల వర్షాల నేపథ్యంలో నిర్వహకులు ముందు జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం కొనుగోళ్లను సైతం ముమ్మరం చేయకపోవడంతో రైతులు రోజుల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు.
రైతులపై టార్పాలిన్ల కిరాయి భారం
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు టార్పాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు పట్టాలను కిరాయికి తెచ్చుకుంటున్నారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ.30కి తెచ్చుకొని ధాన్యంపై కప్పుకుంటున్నారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సుమారు 20 రోజులకుపైగా పడుతోంది. అయితే రెండు ఎకరాల్లో పండించిన ధాన్యం ఆరబోయడంతో పాటు కప్పడానికి ఐదు పట్టాలు అవసరం. వీటి కోసం రోజు రూ.150 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా 20 రోజుల పాటు ఉంటే రైతుపై రూ.3వేల అదనపు భారం పడుతుంది.
ఇది.. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం. ఈ కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. నీడకోసం చిన్న గుడిసె వేసినప్పటికీ అది నిర్వాహకులు ఉండడానికే సరిపోతుంది. రైతులు మాత్రం చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. టార్పాలిన్ల సరఫరాలేక రైతులే కిరాయికి తెచ్చుకొని ఇలా కొప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఈ పరిస్థితే నెలకొంది
ఫ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు
ఫ ఎండలో చెట్లను ఆశ్రయిస్తున్న రైతులు
ఫ తాగునీటికీ ఇబ్బందే..
ఫ టార్పాలిన్లులేక వర్షాలకు
తడుస్తున్న ధాన్యం
ఫ మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
చెట్ల కిందనే ఉంటున్నాం
రామన్నగూడెం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో 20 రోజుల కిందట 600 బస్తాల ధాన్యం అమ్మడానికి పోశాను. ఇంతవరకు కాంటాలు కాలేదు. లారీలు రాకపోవడం, మిల్లులలో తొందరగా దిగుమతి కాకపోవడం మూలంగా రోజుల తరబడి కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సౌకర్యాలు ఏమీ లేవు. నీడలేక చెట్ల కిందనే ఉంటున్నాం. ఈ కేంద్రంలో ధాన్యం పోయడానికి స్థలం లేక గంగ దేవమ్మ బండపైనే ధాన్యం పోశాను. వర్షం వస్తే ధాన్యం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది.
– వజ్జె శ్రీనివాస్, రైతు, రామన్నగూడెం

తీరని కషా్టలు

తీరని కషా్టలు

తీరని కషా్టలు