
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సూర్యాపేటటౌన్ : ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అర్జీలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ రాంబాబు
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 80 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలు, హౌసింగ్పై దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. తహసీల్దార్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీఎంహెచ్ఓ కోటాచలం, డీడబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ సంక్షేమ అధికారి లత, ఎల్డీఎం బాపూజీ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
10 నుంచి కల్యాణమహోత్సవాలు
హుజూర్నగర్ : మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి 15 వరకు స్వామివారి కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకొని సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగ, ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేవ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మహానివేదన చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి , ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం