
ప్రతి కమతానికి ‘భూధార్’
హుజూర్నగర్ : భా భారతి చట్టంతో సులువుగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. సోమవారం హుజూర్నగర్లో భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కమతానికి భూధార్ కార్డు కేటాయించి దీనిలో హద్దులతో కూడిన మ్యాప్ పొందుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఫౌతి చేసేటప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన మ్యుటేషన్లపై అపీల్ చేసుకునేందుకు ధరణిలో అవకాశం లేదని కానీ భూభారతిలో మ్యుటేషన్ల అభ్యంతరాలు ఉంటే రెండు అంచెలుగా అపీల్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. భూభారతి చట్టంపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీఓ శ్రీనివాసులు భూభారతిలోని ఒక్కొక్క అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. సదస్సులో ఏఎంసీ చైర్పర్సన్ దేశ్ముఖ్ రాధిక, డీసీసీబీ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, ఏడీఏ రవి, ఇన్చార్జి తహసీల్దార్ నాగేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్లు జక్కుల నరేందర్, శౌరిరెడ్డి, గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్