
టెక్నీషియనే డాక్టర్గా చలామణి
సూర్యాపేటటౌన్: స్కానింగ్ టెక్నీషియనే డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్న ఉదంతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలో గల ఓ కార్డియాక్ సెంటర్పై వచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ వి. నరేష్కుమార్, డాక్టర్ ఎం. రాజీవ్ బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా రిజిస్టర్ చేసుకున్న కార్డియాలజిస్ట్ లేకుండానే టెక్నీషియన్ తాను కూడా డాక్టర్ అని పేర్కొంటూ పేషెంట్లకు రిపోర్ట్ అందిస్తున్నట్లు గుర్తించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ లీలకృష్ణ పేరు మీద అనుమతి తీసుకున్నారని, కానీ డాక్టర్ లేకుండానే టెక్నీషియనే 2డీ ఈకో పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని మెడికల్ కౌన్సిల్ బృందం సభ్యులు పేర్కొన్నారు. డాక్టర్ లీలకృష్ణ, డాక్టర్ శిరీషకు నోటీసులు జారీ చేశామని, వారు తమ పేరు వినియోగించడానికి సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ అని చెప్పుకుంటూ టెస్టులు నిర్వహిస్తున్న వనం శరత్చంద్రపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఫ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లో వెలుగులోకి
ఫ కేసు నమోదు