
‘పాలిటెక్నిక్’ పిలుస్తోంది
తిరుమలగిరి (తుంగతుర్తి): పదవ తరగతి తరువాత సాంకేతిక విభాగాల్లో డిప్లొమా కోర్సులు చేసేందుకు విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలు దన్నుగా నిలుస్తున్నాయి. వీటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవచ్చు.
రెండు కళాశాలల్లో 300 సీట్లు
జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వీరంతా పాలిసెట్ రాసేందుకు అర్హత ఉంటుంది. తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేటలో ఒక్కొక్కటి చొప్పున రెండు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, సూర్యాపేట కళాశాలలో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో 60, డిప్లొమా కంప్యూటర్లో 60 సీట్లు, ఈసీఈలో 60 చొప్పున రెండు కళాశాలల్లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. పాలిసెట్లో సాధించిన మార్కులు, పదవ తరగతిలో వచ్చిన జీపీఏ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో హాస్టల్ వసతి కూడా ఉంది.
కోర్సు తరువాత ఉద్యోగ అవకాశాలు
పాలిటెక్నిక్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సులు పూర్తి చేసే వారికి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఏయిర్ లైన్స్, ట్రాన్స్పోర్టు గనులు, ఇండియన్ ఆర్మీ, నావి, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, బీహెచ్ఈఎల్, బీడీఎల్, బీఎస్ఎన్ఎల్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు సాధించవచ్చు. ఈ కళాశాలలో నాణ్యమైన టెక్నికల్ విద్య అందుతుంది. భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. పాలిసెట్కు అప్లయ్ చేయడానికి ఏప్రిల్ 21వ తేదీ వరకు చివరి గడువు ఉంది.
– సత్తయ్య, పాలిటెక్నిక్ కళాశాల
ప్రిన్సిపాల్, తిరుమలగిరి
ఫ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఫ ఆఖరు తేది ఏప్రిల్ 21
ఫ మే 13న పాలిసెట్
ఫ ఎస్సీ, ఎస్టీలకు రూ.250,
ఇతరులు రూ.500 ఫీజు
ఫ జిల్లాలో రెండు కళాశాలలు