
ఇంటర్ సప్లిమెంటరీలో నిరాశ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. తాజాగా వెలువడిన ఫలితాలలో సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థు లు 65శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 10వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 5525 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3607 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 47శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచారు. 6,151 మంది విద్యార్థులు హాజరు కాగా, కేవలం 2,890 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొదటి ఏడాది విద్యార్ధులు 207మంది హాజ రుకాగా 127మంది, రెండో ఏడాది 244 మంది హాజరు కాగా 187మంది పాసయ్యారు.
10 నుంచి డిగ్రీ పరీక్షలు
ప్రారంభం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఎండ్ విధానంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్ కింద ఈ నెల 10 నుంచి ఆరో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వర్సిటీ యూజీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.పద్మారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. 2, 4 సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 వ తేదీ నుంచి వచ్చే నెల 8 వ తేదీ వరకూ జరుగుతాయని తెలిపా రు. ఇటీవల విడుదల చేసిన డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. దీనికి సంబంధించి 41 మంది రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా 16 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో, జ్ఞానభూమి పోర్టల్ ఉంచామని అధికారులు తెలిపారు.
బెల్టుషాపులపై దాడులు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలస పంచాయతీ బెండువానిపేట గ్రామాల్లో బెల్టుషాపులపై రూరల్ పోలీసులు శనివారం దాడులు చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామంలోని ఇళ్ల వద్ద అక్రమంగా బెల్డుషాపులు నిర్వహిస్తున్న వారి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో పంపాన లక్ష్మీ వద్ద 40 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోగా, ఆర్.చిట్టిమ్మ వద్ద మరో 22 క్వార్టర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ రాము తెలిపారు.
పరిమళించిన మానవత్వం
కాశీబుగ్గ: పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో ఓ వృద్ధుడు వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. మండుటెండలో రో డ్డుపై వృద్ధుడు అలా పడి ఉండడాన్ని గమనించి న టెక్కలిపట్నం సర్పంచ్ పాలిన కృష్ణారావు, గోపాలమిత్ర అవుగాన బాలకృష్ణతో కలిసి బస్టాండ్కు తీసుకువచ్చారు. అనంతరం ఆ వృద్ధునికి సపర్యలు చేసి భోజనం తినిపించి నీరు తాగించారు.