
పాత శ్రీకాకుళంలో.. పండగ శోభ
సిరిమాను తిరిగే ప్రాంతాలివే..
సిరిమాను ఉత్సవం ముందుగా మావూరి వీధిలో చిట్టియ్య ఇంటి నుంచి వెయ్యి కళ్ల ఘటంతో ప్రారంభమవుతుంది. రెండు సిరిమానులు సంతోషిమాత గుడి వద్దకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి మావూరు వీధి, కలెక్టర్ బంగ్లా, హరిజన వీధి, బాదుర్లపేట, కొత్తపేట, కునుకుపేట వరకు వెళ్లి తిరిగి వెనుకకు వచ్చి కుందనపుపేట మీదుగా జిల్లా పరిషత్ కూడలికి చేరుతుంది. అక్కడి నుంచి దేశెల్లవీధి, నక్కవీధి, దండివీధి చేరుకొని పెద్దమ్మతల్లి ఆలయానికి ఒక సిరిమాను, నక్కవీధిలోని నూకాలమ్మతల్లి ఆలయానికి మరో సిరిమాను చేరుతుంది. సుమారు రెండున్నర కిలోమీటర్లు సిరిమాను ఊరేగింపు జరుగుతుంది. ఉత్సవం తిలకించేందుకు సుమారు 10 లక్షల మంది జనం వస్తారని అంచనా. చివరి రోజైన జూన్ 10న రెండు సిరిమానులు, దేశెల్లవీధి నుంచి పడవ, బాదుర్లుపేట నుంచి రథం, దండి వీధి నుంచి ఏనుగు, కలెక్టర్ బంగ్లా వీధి నుంచి మహిషాసుర మర్దని, చిన్నచిన్న వేషాలు, గరిడి, మేళతాళాలతో అమ్మవార్ల ఊరేగింపు నిర్వహిస్తారు. 11వ తేదీన మధ్యాహ్నం 11గంటల నుంచి బంధువులకు, స్నేహితులకు విందు భోజనాలు మొదలవుతాయి.
శ్రీకాకుళం కల్చరల్: పాత శ్రీకాకుళం సరికొత్తగా ముస్తాబవుతోంది. ఐదు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ గ్రామదేవత పండగలకు సిద్ధమవుతోంది. ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ సిరిమాను ఉత్సవంలో సుమారు పది లక్షల మంది జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున.. అందుకు తగ్గట్లుగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా పరిషత్ నుంచి అటు బాదుర్లపేట, కునుకుపేట పరిసర ప్రాంతాల మధ్య వీధులన్నీ విద్యుద్దీప అలంకరణలతో ధగధగా మెరిసిపోతున్నాయి.
ఘన చరిత్ర..
దశాబ్దాల కిందట పాత శ్రీకాకుళంలో కలరా, మసూచి వంటి వ్యాధులు విజృంభించేవి. వాటి నుంచి అమ్మవార్లే కాపాడాలని కోరుతూ అప్పటి పేదలు సిరిమాను ఉత్సవం చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో 1966లో తొలిసారిగా సిరిమాను నిర్వహించినట్లు కొందరు చెబుతుంటారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్ల కొకసారి సిరిమాను వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది 2025లో మే 6న గ్రామదేవత పండగలు ప్రారంభమయ్యాయి. జూన్ 10న ముగింపు ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున పెద్దమ్మతల్లి, నూకాలమ్మతల్లి సిరిమానుల అనుపు ఉత్సవంతో వేడుకలు ముగుస్తాయి. పాతశ్రీకాకుళంలో ఉన్న ఐదుగురు అమ్మవార్లు ముత్యాలమ్మతల్లి, నక్కవీధిలోని నూకాలమ్మతల్లి, సంతోషిమాత కూడలి వద్ద దుర్గమ్మతల్లి, మావూరు వీధిలోని పెద్దమ్మతల్లి, కొత్తపేట వద్ద సన్నాల పోలమ్మతల్లికి చల్లదనం కోసం 36 రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు.
పెద్దల నిర్ణయం..
సిరిమాను పండగను మాపెద్దలు నిర్ణయించారు. దాని ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఉత్సవం జరుపుతున్నాం. రద్దీ నేపథ్యంలో మహిళా భక్తులు మాత్రమే అమ్మవారిని తాకాలి. – దండి పంకజాక్ష దేవ్,
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు
సిరిమాను ఉత్సవాలకు ముస్తాబవుతున్న నగరం
పదేళ్ల తర్వాత జరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ నెల 10న ఒకేసారి రెండు సిరిమాను ఉత్సవాలు
పది లక్షల మంది జనాలు వస్తారని అంచనా

పాత శ్రీకాకుళంలో.. పండగ శోభ

పాత శ్రీకాకుళంలో.. పండగ శోభ

పాత శ్రీకాకుళంలో.. పండగ శోభ