
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..
రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని సూర్య స్కూల్ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మసిగడాం జంక్షన్లో నివాసముంటున్న తోరాడ సాయి(36) జె.ఆర్.పురం జగనన్న కాలనీలోని శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. సూర్య స్కూల్ జంక్షన్లో రోడ్డు క్రాస్ చేసేందుకు ఆగారు. ఆ సమయంలో విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. సాయి తలభాగం నుజ్జయిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయి కమ్మ సిగడాం జంక్షన్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. భర్త రామ్మూర్తి వంట పని చేస్తుంటారు. సాయి స్వగ్రామం దేవరాపల్లి. ఈమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. భర్త రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
మహిళ దుర్మరణం

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..