
వీఆర్ఏలకు వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలు పెంచాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, వీఆర్ఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లులు డ్యూటీలు రద్దుచేయాలని, డీఏను జీతంలో కలపాలని, వీఆర్వో, అటెండర్, రికార్డు అసిస్టెంట్, వాచ్మేన్, డ్రైవర్ ఖాళీ పోస్టుల్లో అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం రోడ్డు నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నా అనంతరం డీఆర్ఓ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ఎన్.సీతప్పడు, బి.అప్పారావు, జి.రామ్మూర్తి, కె.లక్ష్మణ, ఎం.రాముడు, బి.రాములమ్మ, ఢిల్లీశ్వరరావు, రాంబాబు, పద్మ, మీనాక్షి, రాజులమ్మ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.