
చంద్రబాబు పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబునాయుడు పర్యటన పూర్తిగా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడిందని తప్ప జిల్లాకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేయాలని చూసిన చంద్రబాబు, నిజాలను పూర్తిగా మర్చిపోయారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వాస్తవాన్ని ఆయన గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ గుర్తించకపోవడం దారుణమన్నారు. భావనపాడు పోర్టు విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం అర్థరహితమన్నారు. పోర్టుకు భూముల సేకరణ, పునరావాస పనులు వంటి అన్ని పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, బీమా ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది జగన్మోహన్రెడ్డి సారథ్యంలోనే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయటానికి ముందు 14 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజల కోసం ఏం చేసారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. హామీలిచ్చి విస్మరించడం సరికాదన్నారు.