కూటమిలో చేరికల యుద్ధం | - | Sakshi
Sakshi News home page

కూటమిలో చేరికల యుద్ధం

Jun 9 2025 7:52 AM | Updated on Jun 9 2025 7:52 AM

కూటమి

కూటమిలో చేరికల యుద్ధం

ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య చేరికల తతంగం రణరంగాన్ని తలపిస్తోంది. అవకాశ వాదులు, ఆశావహులను, ఇతర పార్టీలలో ఉన్న వారికి గాలం వేసి మా పార్టీలో చేరాలంటే మాపార్టీలో చేరాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు పోటీ పడుతుండటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. గతంలో అనేక సంఘటనలు వీరి మధ్య అనైక్యతను బహిర్గతం చేశాయి. పైకి పొత్తు ధర్మం ప్రకారం అందరం నడుచుకోవాలని చెపుతూనే లోలోపల ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుండటం చూసి ప్రజలు విస్మయానికి లోనవుతున్నారు.

ధర్మవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, జనసేన ఇన్‌చార్జ్‌ చిలకం మధుసూదన్‌రెడ్డిలు నియోజకవర్గంలో పట్టు సాధించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఆరంభంలో నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను, ఆశావహులకు గాలం వేసి, బెదిరించి తమ పార్టీలోకి చేర్చుకోవాలని మూడు పార్టీల వారు ప్రయత్నం చేశారు. అయితే ఒక పార్టీ వారు చేర్చుకునే ప్రయత్నం చేస్తుండగానే మరొక పార్టీ వారు అడ్డు పడటం పరిపాటిగా మారడంతో చేరికల కార్యక్రమం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే..

● ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో ఉన్న కృష్ణాపురం జమీర్‌ అహ్మద్‌ను బీజేపీలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే జమీర్‌ను బీజేపీలోకి చేర్చుకోవద్దంటూ టీడీపీ నుంచి బీజేపీ నాయకులకు ఒత్తిడి వచ్చింది. అయినప్పటికి బీజేపీ నాయకులు బేఖాతర్‌ చేస్తూ జమీర్‌అహ్మద్‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో జమీర్‌ ఇంటికి వెళ్లి టీడీపీ నాయకులు గొడవపెట్టుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి.

● కుణుతూరు పంచాయతీ పరిధిలోని పోతుకుంటలో సర్పంచ్‌ అంగజాల నాగవేణి, ఆమె భర్త అంగజాల రాజును బీజేపీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేయగా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. ఏకంగా టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ వద్ద ఈ పంచాయితీ జరిగింది. దీంతో అంగజాల రాజు బీజేపీలోకి చేరికను కొంతకాలం వాయిదా వేసి.. తర్వాత మంత్రి సత్యకుమార్‌ సమక్షంలో చేర్చుకోవడంతో టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఇదే పంచాయతీ పరిధిలోని పోతుకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని టీడీపీ నాయకులు అడ్డుపడినప్పటికీ జనసేన పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో ఆ పంచాయతీలోని టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

● ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నాయకులు వద్దని వారించినప్పటికీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తొండమాల ఉమాదేవి, ఆమెభర్త తొండమాలరవి, సరితాల ఆశాబీ, ఆమె భర్త సరితాల బాషా, మల్లెల రమణమ్మ, ఆమె భర్త తోపుదుర్తి వెంకటరాముడిని ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన ఇన్‌చార్జ్‌ మధుసూదన్‌రెడ్డి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. బీజేపీ, జనసేన పార్టీలు ఏమాత్రమూ ఖాతరు చేయకపోవడంతో టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ దృష్టికి తీసుకెళ్లి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

చేరికలను పోటాపోటీగా

తీసుకుంటున్న నేతలు

పొత్తు ధర్మం విస్మరిస్తుండటంతో

కేడర్‌లో అసంతృప్తి

టీడీపీ, బీజేపీ, జనసేన నేతల తీరుపై ప్రజల విస్మయం

కూటమిలో చేరికల యుద్ధం1
1/1

కూటమిలో చేరికల యుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement