
429 మందికి ఎస్ఏలుగా పదోన్నతి
● ఎస్జీటీలకు నేడు వెబ్ ఆప్షన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 429 మంది ఎస్జీటీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్ పదోన్నతులు లభించాయి. ఇందులో పీఎస్హెచ్ఎంలుగా 141 మంది (కన్నడ 1, తెలుగు 130, ఉర్దూ 10) ఉన్నారు. అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ 46 మంది, హిందీ 01, తెలుగు 01, ఉర్దూ 01, బీఎస్ (తెలుగు) 38 మంది, బీఎస్ (ఉర్దూ) 04, గణితం (తెలుగు) 80 మంది, గణితం (ఉర్దూ) 05, పీడీ (తెలుగు) 06, పీఎస్ (కన్నడ) 01, పీఎస్ (తెలుగు) 46, పీఎస్ (ఉర్దూ) 01, సోషల్ (కన్నడ) 02, సోషల్ (తెలుగు) 50, సోషల్ (ఉర్దూ) ఆరుగురికి పదోన్నతి కల్పించారు. వీరితో పాటు ఇటీవల తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలైన స్కూల్ అస్టెంట్లందరూ ఆదివారం వారి పాతపాఠశాలల్లో రిలీవ్ అయ్యారు. సోమవారం కొత్త స్కూళ్లల్లో రిపోర్ట్ చేసుకోనున్నారు.
ఎస్జీటీలకు నేడు వెబ్ ఆప్షన్లు
కాగా ఎస్జీ టీచర్ల బదిలీల్లో భాగంగా సోమవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఓవైపు మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని టీచర్లు, సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా....ప్రభుత్వం మాత్రం వెబ్ కౌన్సెలింగ్కే మొగ్గు చూపింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇబ్బంది అని భావించేవారి కోసం ప్రతి మండలంలోనూ ఎమ్మార్సీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోకి వెళ్తే... సిబ్బంది వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రసాద్బాబు తెలిపారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం/ పుట్టపర్తి టౌన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.
పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కలిసి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు.
అత్యాచారం దారుణం
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప
మడకశిర: రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దారుణమని వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యాచారానిక పాల్పడిన వారందరూ టీడీపీకి చెందిన వారేనని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు. మహిళా ఎమ్మెల్యే, మహిళా ఎస్పీ ఉన్నా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం.. నిందితులపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమన్నారు. పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగానికి వత్తాసు పలుకుతుండడంతోనే అత్యాచారాలను అరికట్టలేకపోతున్నారని ఆరోపించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ఈఏపీసెట్లో
పలువురు ప్రతిభ
కదిరి అర్బన్/ నల్లచెరువు: ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. కదిరి మండలం మొటుకుపల్లికి చెందిన రాధమ్మ, శేఖర్రెడ్డి దంపతుల కుమారుడు ఆర్.హర్షిత్రెడ్డికి 159వ ర్యాంకు వచ్చింది. కదిరికి చెందిన సుబ్రహ్మణ్యంనాయుడు కుమారుడు కార్తికేయకు 501 ర్యాంకు సాధించాడు. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి, కె.రాజారెడ్డి దంపతుల కుమార్తె జశ్వితరెడ్డి 444వ ర్యాంకు సాధించింది.

429 మందికి ఎస్ఏలుగా పదోన్నతి