
ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
కదిరి టౌన్: శ్రీదేవి భూదేవి వసంతవల్లభుడు ఖాద్రీశుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓం నమో నారసింహా..అంటూ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించుకున్నారు. మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నేడు ఏడు గుర్రాలపల్లికి మహిళా కమిషన్ సభ్యురాలి రాక
ప్రశాంతి నిలయం: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ షేక్ రోఖియా బేగం సోమవారం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ చేతన్ మీడియాకు వెల్లడించారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఏడుగుర్రాలపల్లికి చేరుకుంటారు. అక్కడ లైంగిక దాడికి గురైన దళిత బాలికను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వివరాలు తెలుసుకుంటారు. 11.15 గంటలకు బాధితురాలి ఇంటి నుంచి రామగిరి పోలీస్ష్టేషన్కు వెళ్లి అధికారులతో ఘటనపై ఆరా తీస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి చేరుకుంటారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి లైంగికదాడి ఘటనకు గల కారణాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఐడీడీఎస్ పీడీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం బెంగళూరుకు బయల్దేరి వెళ్తారు.
సత్యసాయి మార్గంలో నడవాలి
ప్రశాంతి నిలయం: సత్యసాయి మార్గంలో నడిచి కుటుంబంతో పాటు చక్కటి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సమాజంలో ఆధ్యాత్మిక, మానవతా విలువలు పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేసే అంశంపై చర్చించేందుకు ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ మహిళా సదస్సు ఆదివారం ముగిసింది. ఉదయం సత్యసాయి మహిళా విభాగం సభ్యులు యజుర్ మందిరం నుంచి సత్యసాయి మహాసమాధి వరకు ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల పతాకాన్ని, సత్యసాయి విలువను చూపే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళామణులు తమ సందేశాన్ని వినిపించారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు బాలల దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు
గాండ్లపెంట: ఎన్పీకుంట మండలం ఎదురుదొన పంచాయతీ ముఖములవారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలలు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకల్లు మండలం మారెప్పగారిపల్లికి చెందిన స్నేహితులు మహమ్మద్ సుహైల్ (16), లతీఫ్ (15), తోసిఫ్ గాండ్లపెంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమానును సందర్శించడానికి ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ముఖములవారిపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న మహమ్మద్ సుహైల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లతీఫ్, తోసిఫ్లను స్థానికులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి తర్వాత లతీఫ్ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే బాధిత తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు.

ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు