
భూసేకరణతో మా పొట్టకొట్టొద్దు
మడకశిర రూరల్: ‘‘పరిశ్రమలు కావాల్సిందే. అందుకోసం మా భూములు సేకరించి మా పొట్టకొట్టొద్దు...ఇప్పటికే తొలివిడత భూసేకరణలో భూములు కోల్పోయాం. ఇప్పుడున్న ఉన్న కొద్దిపాటి భూములనూ సేకరిస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. దయచేసి మా భూములు సేకరించకండి’’ అంటూ గౌడనహళ్లి పంచాయతీలోని జమ్మానిపల్లి, తురుకువాండ్లుపల్లి, గౌడనహళ్లి గ్రామాల రైతులు కలెక్టర్ చేతన్ను వేడుకున్నారు. బుధవారం కలెక్టర్ చేతన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సునౌనా సోని తదితరులు ఆర్.అనంతపురం వద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించిన భూములను పరిశీలించారు. సెజ్ భూముల్లోని మట్టిని కొందరు అక్రమంగా తవ్వుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఏపీఐఐసీ ద్వారా సేకరించిన, సేకరించనున్న భూములకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు.
అన్యాయం చేయొద్దు సార్..
పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి ఇప్పటికే భూములిచ్చామని, రెండో విడతలోనూ తమ గ్రామంలోనే భూసేకరించి తమను అన్యాయం చేయవద్దని జమ్మానిపల్లి, తురుకువాండ్లుపల్లి, గౌడనహళ్లి గ్రామాల రైతులు కలెక్టర్ చేతన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులకు వేడుకున్నారు. ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు. భూసేకరణ నిలిపివేయాలని ఇప్పటికే డీఆర్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించామని రైతులు గుర్తు చేశారు. అయితే వర్షాలు కురువక బీడుగా మారిన భూముల వల్ల రైతులకు నష్టం కలుగుతున్నట్లు గుర్తించి... సోలార్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల రైతులకు ఎకరాకు రూ.30 వేల ఆదాయం వస్తుందని ఏపీఐఐసీ చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ను వేడుకున్న
రెండు గ్రామాల రైతులు
ఇప్పటికే ఏపీఐఐసీకి భూములిచ్చి అన్యాయమయ్యామని ఆవేదన