
గేదెలను కడిగేందుకు వెళ్లి యువకుడు మృతి
చిలప్చెడ్(నర్సాపూర్): గేదెలను కడిగేందుకు వెళ్లిన యువకుడు ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలం ఫైజాబాద్ శివారులో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... మండల పరిధిలోని బండపోతుగల్ గ్రామానికి చెందిన దారా శేఖర్ (24) ఫైజాబాద్ గ్రామానికి చెందిన టేకుల నర్సింహా రెడ్డి వద్ద గేదెలు మేపడానికి జీతం ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులో గేదెలను మేపేందుకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి వచ్చాయి. కానీ అతడు మాత్రం రాలేదు. విషయాన్ని నర్సింహా రెడ్డి శేఖర్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు వస్తాడులే అని ఊరుకున్నారు. శనివారం ఉదయం నర్సింహా రెడ్డి, శేఖర్ అన్న రవి గ్రామ శివారులో వెతుకుతుండగా వడ్లోని కుంటలో శేఖర్ మృతదేహం కనిపించింది. గేదెలను కడిగేందుకు, బట్టలు, మొబైల్ను గట్టునపెట్టి కుంటలోకి దిగాడు. జేసీబీ గుంతని గుర్తించని శేఖర్ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.