
విత్తు తొందరపాటేనా!
రోహిణి కార్తెలో అకాల వర్షాల సంబరం
● ముందే విత్తిన పత్తి విత్తనాలు ● వేడిమితో చనిపోతున్న విత్తన పిండం ● 12తర్వాతే వర్షాలంటున్న వాతావరణశాఖ
ముందస్తుగా విత్తనాలు వేసిన కూలీలు
నారాయణఖేడ్: బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రోహిణి కార్తెలో అకాల వర్షాలు కురవడం..రుతుపవనాలు సైతం ముందస్తుగానే పలకరిస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పడం...కొందరు రైతులు సైతం తొందరపడి ముందస్తుగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అయితే రైతులు, వాతావరణ శాఖ వేసిన అంచనాలు తల్లకిందులై రోహిణి కార్తెలో ఎండలు దంచికొట్టడంతో వేసిన పత్తి విత్తనాలు మొలకదశలోనే వాడిపోయాయి.
తొందరపాటుతో నష్టమే
రోహిణి కార్తెలో కురిసిన వర్షాలతో వేసిన పత్తి విత్తనాలతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మే నెలలో సాధారణంగా 19.1మి.మీ వర్షపాతం కురియాల్సి ఉంది. కానీ, వర్షాకాలం తరహాలో 106మి.మీ వర్షపాతం కురిసింది. జిల్లాలో 15, 16, 17, 18, 21, 23, 24 అధిక వర్షపాతం నమోదు కాగా 17న అత్యధికంగా జిల్లాలో 29.5మి.మీ, 24న 23.7మి.మీ నమోదయ్యింది. భారీ వర్షాల వల్ల రైతులు జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో సుమారు 20వేల ఎకరాల వరకు పత్తి విత్తనాలు విత్తారు. ఎకరా పత్తి విత్తనాలు నాటేందుకు 1.75కిలోల విత్తనం బస్తాకు రూ.1వేయి, 8 నుంచి 10మంది కూలీలకు రూ.4వేల నుంచి 5వేల వరకు వెచ్చించగా ఇతరత్రా ఖర్చులు కూడుకుని రూ.6వేల నుంచి రూ.7వేలు ఖర్చు చేశారు.
ముఖ్యంగా గర్భు నేలల్లో విత్తడం వల్ల నష్టం అధికంగా వాటిల్లుతుంది. నల్లరేగడి నేలలు నీటి తడులను తట్టుకుని ఉండటం వల్ల వర్షాలు కొంత ఆలస్యమైనా విత్తనం చనిపోకుండా ఉంటుంది. మొరంతో కూడుకున్న గర్భునేలల్లో నీటి తడులు పట్టుకొని ఉండకుండా కురిసిన నీరు భూగర్భంలోకి ఇంకడం వల్ల విత్తనం వేశాక ఎండలు కాయడంతో విత్తన పిండం చనిపోతుంది. గతేడాది కూడా ఇలాగే ముందస్తు కురిసిన వర్షాలకు పత్తి విత్తుకొన్న రైతులు చివరకు మొలకలు సరిగా రాకపోవడంతో దున్నేసి తిరిగి విత్తనాలు విత్తుకున్నారు.
మృగశిర ప్రవేశించాకే...
మృగశిర కార్తె ప్రవేశించాక తొలకర్లు కురిసి భూమి బాగా నానిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతూనే ఉన్నారు. అధికారుల సూచనలు అంతగా పట్టించుకోకపోవడం వల్ల గతేడాది, ఈ ఏడు విత్తనాలు ముందస్తుగా విత్తిన రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఈ ఖరీఫ్లో పత్తి విత్తనాలను 1,43,817.81 హెక్టార్లలో సాగుచేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.
12 తర్వాతే వర్షాలు..
మృగశిర కార్తె ఈనెల 8న ప్రారంభం అవుతుంది. కార్తె ప్రారంభం నుంచి తొలకర్లు పలకరిస్తాయి. కాగా వాతారణ శాఖ అధికారులు 12వ తేదీ తర్వాతే తొలకరి వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరణకు అవసరమైన తేమ వెళ్లిపోవడం వల్లనే ప్రస్తుతం పొడిగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. మరో వారంపాటు నైరుతి రుతుపవనాల పురోగమనం కష్టమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా రైతులు ముందస్తు వర్షాలకు తొందర పడటం వల్ల నష్టాన్ని మిగులుస్తున్నట్లు తెలుస్తోంది.

విత్తు తొందరపాటేనా!