
సేద్యంలో రైతే శాస్త్రవేత్త
హుస్నాబాద్: వ్యవసాయ సేద్యంలో రైతే పెద్ద శాస్త్రవేత్త అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండ రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి తెచ్చి రైతుల ఇక్కట్లను దూరం చేస్తున్నారన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయన్నారు. త్వరలో రైతుకు విత్తన హక్కు కల్పించే విధంగా విత్తన చట్టం తీసుకువచ్చేందుకు కమిటీలు వేశామని తెలిపారు. పసుపు రైతులు యాంత్రీకరణ దిశగా ఆలోచించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని కోదండరెడ్డి సూచించారు. రైతుకు కులం, మతం లేదని అందరి వాడని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు. భూ పరీక్ష చేసుకొని అనుకూలమైన పంట వేయాలని సూచించారు.
మంచి విత్తనాలు అందిస్తాం
సీడ్ కార్పొరేషన్ ద్వారా మేలైన విత్తనాలు అందిస్తున్నామని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ కంపెనీల ప్రచారాలకు మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని, అయినా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. పంట మార్పిడి చేసి దిగుబడి సాధించుకోవాన్నారు. యంత్ర పరికరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.
త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థ,విత్తన చట్టం
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
సద్వినియోగం చేసుకోండి
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకురావడానికే రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఎవరైనా ఈఎంఐ కింద రుణాలు పొంది యంత్రాలు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భవానీ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.