త్యాగానికి ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Jun 8 2025 7:19 AM | Updated on Jun 8 2025 7:19 AM

త్యాగ

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం

పటాన్‌చెరు టౌన్‌: త్యాగానికి చిహ్నమైన బక్రీద్‌ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకుని శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్‌ ఒకటని, ఈ పండుగ త్యాగానికి ప్రతీకని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ బక్రీద్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌ బక్రీద్‌ను పురస్కరించుకుని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

గెస్ట్‌ టీచర్‌ పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

వట్‌పల్లి(అందోల్‌): మండల పరిధిలోని పోతులబొగుడా మోడల్‌ పాఠశాలలో 2025–26 ఏడాదికిగాను అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ దీనా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పీజీటీ వృక్షశాస్త్రం–1, పీజీటీ గణితం–2 మొత్తం మూడు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ అర్హతను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు ఒక జత జిరాక్స్‌ పత్రాలను ఈ నెల 13న పాఠశాలలో నిర్వహించే డెమో తరగతులకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 7569382704 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

అనుమతుల్లేకుండా

వ్యాపారాలు చేయవద్దు

జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్‌ తిరుపతి

జోగిపేట(అందోల్‌): ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకుండా వ్యాపార సంస్థలను నడపకూడదని జోగిపేట మున్సిపాలిటీ కమిషనర్‌ సీహెచ్‌.తిరుపతి స్పష్టం చేశారు. జోగిపేట పట్టణంలోని దుకాణాలలోని ట్రేడ్‌ లైసెన్స్‌లను శనివారం పరిశీలించారు. లైసెన్స్‌ లేనివారు వెంటనే తీసుకోవాలని లేదంటే జరిమానాలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణంలో 634 దుకాణదారులు మాత్రమే లైసెన్స్‌లు కలిగి ఉన్నారని, రెన్యూవల్‌ చేయించుకోవలసిన వారు వెంటనే అనుమతులను పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు.

10న గిరిజన గురుకులంలో

ఇంటర్‌లో ప్రవేశాలు

నారాయణఖేడ్‌:ఖేడ్‌ గిరిజన బాలుర సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు ఈనెల 10న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ యాదగిరి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు టీసీ, పదోతరగతి మార్కుల మెమో, స్టడీ, కండక్ట్‌ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం, గ్రామీణ ప్రాంతాలవారైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలవారైతే రూ.2 లక్షలకు మించని ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ జిరాక్స్‌, క్రీడలు, అర్థాన్‌, దివ్యాంగులైతే ధ్రువీకరణ పత్రాలు, మూడు కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రెండు జతల జిరాక్స్‌ ప్రతులతో హాజరు కావాలని సూచించారు.

రేపు ‘రైతు ముంగిట్లో

శాస్త్రవేత్తలు’

రాయికోడ్‌(అందోల్‌): మండల కేంద్రం రాయికోడ్‌లోని రైతువేదికలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి సారిక శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంటల సాగుకు సంబంధించి ఏడీఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. పంట మార్పిడి ప్రాధాన్యత, దిగుబడులు పెంచుకునే మార్గాలు, నూతన వంగడాల ప్రత్యేకతలు, ప్రాంతీయ పంటల యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై సమగ్ర వివరాలను రైతులకు వివరిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌1
1/1

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement