
సీసీ కెమెరాలు పట్టించాయి
● రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి అరెస్ట్
● తానే కారు నడిపినట్లు పోలీస్ స్టేషన్కు వచ్చిన మరో వ్యక్తి
● సీసీ ఫుటేజీతో నిజం వెలుగులోకి..
బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... అంబర్పేట డీడీకాలనీకి చెందిన శిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కోకాపేటలోని స్నేహితుడితో కలిసి విందుకు హాజరైన అతను మద్యం సేవించాడు. ఆదివారం తెల్లవారుజామున కోకాపేట నుంచి ఇంటికి వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని సినీ హీరో బాలకృష్ణ ఇంటి వద్ద మలుపు తిప్పే క్రమంలో మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. బెలూన్లు ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న శిరీష్ క్షేమంగా బయటపడ్డాడు. అయితే పోలీసులు కేసు పెడతారనే భయంతో కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెంబర్ ప్లేట్ ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కారు వివరాలను ఆరా తీయగా డి.కృష్ణశాస్త్రి అనే పేరుతో ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా పరారీలో ఉన్న కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తుండగా సోమవారం ఉదయం ఓ వ్యక్తి పోలీస్స్టేషన్కు వచ్చి కారు తానే నడిపినట్లు చెప్పాడు. అయితే అప్పటికే సీసీ కెమెరాలను పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన కారు నడుపుతున్న వ్యక్తికి, పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయిన వ్యక్తికి తేడా ఉండటంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిందితుడు బయటపడ్డాడు. కారు నడుపుతున్న వ్యక్తిని గాలించి అరెస్టు చేసి స్టేషన్కు తీసుకువచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఒక రోజు గడిచిన తర్వాత కూడా మద్యం సేవించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ మేరకు శిరీష్తో పాటు కారు తానే నడిపానంటూ అబద్దం ఆడిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. తాను మద్యం సేవించి తెల్లవారుజామున ఇంటికి బయలుదేరానని అంగీకరించిన శిరీష్ అరెస్టు చేస్తారనే భయంతో తన స్థానంలో మరొకరిని పోలీస్స్టేషన్కు పంపినట్లు తెలిపాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అసలు నిందితుడిని గుర్తించి అరెస్టు చేయగలిగారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.