జాతీయ స్ఫూర్తి.. దేశీయ కీర్తి! | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్ఫూర్తి.. దేశీయ కీర్తి!

Jun 8 2025 7:18 AM | Updated on Jun 8 2025 7:18 AM

జాతీయ స్ఫూర్తి.. దేశీయ కీర్తి!

జాతీయ స్ఫూర్తి.. దేశీయ కీర్తి!

సాక్షి, సిటీబ్యూరో/కాచిగూడ: అందమైన శ్వేతసౌధమైన నిజాం కాలం నాటి చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్‌ మరింత కళాత్మకతను సంతరించుకోనుంది. స్టేషన్‌ ముఖద్వారం రకరకాల థీమ్‌ లైటింగ్‌తో వెలుగొందనుంది. దేశభక్తిని, జాతీయతా స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన థీమ్‌లను విద్యుత్‌ కాంతులతో ప్రదర్శిస్తారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయోత్సవాన్ని ప్రతిబింబించే త్రివర్ణకాంతులు, మహిళా దినోత్సవానికి పింక్‌ లైటింగ్‌ వంటి థీమ్‌లను ఆయా ప్రత్యేక సందర్భాల్లో ఆవిష్కరించేలా అధునాతన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించనున్నారు.

అబ్బురపరిచే నిర్మాణశైలి

1916లో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాచిగూడ రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. నగరంలోని నిజాం నవాబులు, ప్రముఖుల కుటుంబాల రాకపోకలకు ఈ రైల్వే స్టేషన్‌ను వినియోగించేవారు. హైదరాబాద్‌ నుంచి ముంబై, ఔరంగాబాద్‌, వాడీ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్లు నడిచేవి. ఇండో–సార్సెనిక్‌, ఇండో –గోథిక్‌ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం గొప్ప వారసత్వ కట్టడంగా గుర్తింపును పొందింది. ప్రస్తుతం సుమారు 50 వేల మంది కాచిగూడ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజు 103 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. థీమ్‌లైటింగ్‌ ప్రారంభోత్సవంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు.

రూ.2.23 కోట్లతో..

పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా కూడా ఈ థీమ్‌లైటింగ్‌ను రూపొందించారు. ఇందుకోసం రూ.2.23 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్‌ దీపాలంకరణ పూర్తిచేశారు. ఈ భవనం నిర్మాణ కౌశలాన్ని, వారసత్వాన్ని చాటేలా సరైన విద్యుత్‌ దీపకాంతులు వెలుగులు విరజిమ్ముతాయి. ప్రయాణికులకు, నగర వాసులకు, పర్యాటకులకు రాత్రివేళల్లో గొప్ప అనుభూతినివ్వనున్నాయి.

అత్యాధునిక సాంకేతికత

ఈ అలంకరణలో విద్యుత్‌ పరికరాలు అవుట్‌డోర్‌ టైప్‌ ఆర్‌జీబీ, ఎల్‌ఈడీ, ఐపీ 66 వంటి ఆధునిక పరికరాలతో రూపొందించారు. దీంతో ఇవి వివిధ రకాల లైటింగ్‌ థీమ్‌లకు అనుగుణంగా ఉంటాయి. లైటింగ్‌ పర్యావరణ హితంగా, సురక్షితంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ లైట్ల నుంచి వెలువడే కాంతి పూర్తిగా కాలుష్య రహితమైనదని పేర్కొన్నారు. భవనం నిర్మాణ వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించడమే ఈ లైటింగ్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు నయా థీమ్‌ లైటింగ్‌

ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక దీపాలంకరణ

త్రివర్ణ కాంతుల్లో శ్వేత సౌధం ధగధగ

రేపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement