‘మెగా వెంచర్‌’ సందర్శన | - | Sakshi
Sakshi News home page

‘మెగా వెంచర్‌’ సందర్శన

May 2 2025 4:14 AM | Updated on May 2 2025 4:14 AM

‘మెగా వెంచర్‌’ సందర్శన

‘మెగా వెంచర్‌’ సందర్శన

కందుకూరు: ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు కేటాయించడానికి మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన మెగా వెంచర్‌ను గురువారం ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌ కె.శశాంక సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి న లేఅవుట్‌లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఏమేం వస్తున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన వెంట టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రావణ్‌ ఉన్నారు.

శ్రమశక్తి అవార్డు ప్రదానం

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు సయ్యద్‌ అబ్దుల్‌ రవూఫ్‌ శ్రమ శక్తి అవార్డును అందుకున్నారు. మేడే సందర్భంగా ప్రభుత్వం తరఫున గురువారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ప్రొఫెషనల్‌ అధ్యక్షుడైన రవూఫ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తన సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేయడం ఎంతో సంతో షంగా ఉందని రవూఫ్‌ పేర్కొన్నారు.

పల్లెల్లో బిహార్‌ సర్పంచుల బృందం పర్యటన

షాబాద్‌: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పనితీరును బిహార్‌ రాష్ట్రానికి చెందిన సర్పంచుల బృందం పరిశీలించింది. ఎన్‌ఐఆర్‌డీలో మూడు రోజుల శిక్షణ కోసం వచ్చిన బిహార్‌ రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన మహిళా సర్పంచుల బృందం గురువారం క్షేత్ర పర్యటనలో భాగంగా మండలపరిధిలోని సర్ధార్‌నగర్‌, చందనవెల్లి, సీతారాంపూర్‌, పోతుగల్‌ గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు స్థానిక అధికారులతో కలిసి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నర్సరీలు, వైకుంఠధామాలు, కంపోస్ట్‌ ఎరువు తయారీ షెడ్లు, రోడ్లను పరిశీలించారు. పంచాయతీలు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అపర్ణ, ఏన్‌ఐఆర్‌డీ కోఆర్డినేటర్‌ విద్యుల్లత, రాజేందర్‌, అరుణ్‌, పంచాయతీ కార్యదర్శులు సురేందర్‌, అశోక్‌, విజయ్‌ సింహ, మల్లేశ్‌, ఫయాజ్‌, ఆశ్రిత, రవికాంత్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మునగపాటి నర్సింలు, ప్రభాకర్‌ రెడ్డి, పాండురంగారెడ్డి, సుల్తానాబేగం పాల్గొన్నారు.

స్తంభించిన మెట్రో సర్వీసులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో సర్వీసులు మరోసారి స్తంభించాయి. ఎల్‌బీనగర్‌– మియాపూర్‌ కారిడార్‌లో సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం సుమారు 20 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సిగ్నలింగ్‌లో తలెత్తిన సమస్యల కారణంగా మెట్రో రైళ్లు ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. కేవలం 9 నిమిషాల వ్యవధిలో సమస్యను పరిష్కరించినప్పటికీ రైళ్ల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టినట్లు పేర్కొన్నారు. మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడడంతో ఎల్‌బీనగర్‌, ఎంజీ బీఎస్‌, నాంపల్లి, అమీర్‌పేట్‌, మియాపూర్‌ తదితర స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మెట్రోల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. సేవలను పునరుద్ధరించినప్పటికీ రద్దీ కారణంగా ఎదురుచూపులు తప్పలేదు. మెట్రో రైళ్ల నిర్వహణలో తరచూ సాంకేతిక సమస్యలతో రైళ్లు నిలిచిపోవడంపై ప్రయాణికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement