
ఆర్మీ జవాన్పై పోలీస్ జులుం!
సాక్షి టాస్క్ఫోర్స్: ఆర్మీ సైనికుడిపై రాచర్ల ఎస్సైతో సహా పోలీసు కానిస్టేబుళ్లు దాడి చేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బాధితుడు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు చేసిన ఫిర్యాదు పత్రాలు బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆర్మీ ఉద్యోగి రాచర్ల ఎస్సైపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. అందిన వివరాల మేరకు.. రాచర్లకు చెందిన జవాన్ మల్లెబోయిన వినోద్కుమార్ జె.పుల్లలచెరువు సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్దకు పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతి కోసం నాలుగు రోజుల క్రితం రాచర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఏఎస్సైతో మాట్లాడుతున్న క్రమంలో ఎస్సై పి.కోటేశ్వరరావు వెనుక నుంచి మెడ పట్టుకుని దాడి చేశారని, అదే సమయంలో స్టేషన్లోని 8 మంది కానిస్టేబుళ్లు దాడి చేయడంతో గాయాలై, చొక్కా సైతం చిరిగిపోయిందని, బంగారు చైన్ రెండు ముక్కలైందని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో జవాన్ పేర్కొన్నారు. ఆర్మీ ఐడీ కార్డు జిరాక్స్ ఇవ్వనందుకు అరెస్టు చేస్తున్నామని చెప్పి రాత్రి 8 గంటల తర్వాత జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లారని, జడ్జి ఆదేశాలతో స్టేషన్ బైయిల్ ఇచ్చి పంపారని అర్జీలో వివరించాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మెడ, గుండె నొప్పి రావడంతో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి ఒంగోలు జీజీహెచ్కు వెళ్లి చికిత్స చేయించుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. జవాన్ ఆరోపణలపై రాచర్ల ఎస్సైని వివరణ కోరగా.. వినోద్కుమార్పై నాలుగు కేసులు ఉన్నాయని, ఓ కేసులో అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్పై వదిలేశామని చెప్పారు.