
మురుగమ్మి కొండ!
పిండవుతున్న
ఎట్టకేలకు కదిలిన
మైనింగ్ శాఖ
మురుగమ్మిలో వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్పై గ్రామస్తులు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. మైనింగ్ శాఖ ఏజీ పోలిరెడ్డి, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్నది వాస్తవమేనని నిర్ధారించారు. మైనింగ్ శాఖ అధికారులు వచ్చారని తెలుసుకున్న స్మగ్లర్లు, డ్రైవర్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో వాహనాలతోపాటు తరలించేందుకు సిద్ధం చేసిన రాయిని సీజ్ చేశారు. వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు మైనింగ్ ఏజీ చెప్పారు.
పీసీపల్లి: వ్యక్తిగత ‘సంపద సృష్టి’ కోసం ఓ టీడీపీ నాయకుడు బరితెగించాడు. మురుగమ్మి సమీపంలోని పచ్చటి కొండ ప్రాంతంలో విరివిగా లభ్యమవుతున్న వైట్ క్వార్ట్జ్ ముడి ఖనిజాన్ని అడ్డగోలుగా తవ్వేస్తున్నాడు. మూడు జేసీబీలతో కొండ ప్రాంతంలో తీసిన భారీ కందకాలు చూసి విస్తుపోవడం గ్రామస్తుల వంతయింది. టీడీపీ నేత సాగిస్తున్న ధ్వంసరచనపై మైనింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా స్పందిచడం విమర్శలకు తావిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామ పరిధిలో అటవీ, బంజర, పోరంబోకు భూముల్లో వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. వైట్ క్వార్ట్జ్ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం రచించిన మురుగమ్మి గ్రామ టీడీపీ నాయకుడు తెలంగాణకు చెందిన వ్యక్తులతో కలిసి అక్రమ మైనింగ్కు తెరలేపాడు. రాత్రీపగలు అనే తేడా లేకుండా మూడు జేసీబీలతో కొండ ప్రాంతాన్ని తొలిచేస్తున్నాడు. సుమారు 20 అడుగుల లోతున.. దాదాపు 70 చోట్ల తవ్విన భారీ గోతులు అటవీ భూముల రూపురేఖలనే మార్చేశాయి.
రూ.లక్షల్లో అక్రమార్జన
వైట్ క్వార్ట్ట్జ్ను గాజు తయారీ పరిశ్రమలు, మెటల్ కాస్టింగ్, రబ్బర్, పెయింట్, సెరామిక్, పెట్రోలియం తదితర పరిశ్రమల్లో అవసరాలకు అధికంగా వినియోగిస్తారు. రాయి నాణ్యతను బట్టి పరిశ్రమలు ధర చెల్లిస్తాయి. పీసీపల్లి మండలంలో మురుగమ్మితోపాటు మరికొన్ని గ్రామాల్లో లభ్యమయ్యే వైట్ క్వార్ట్జ్కు మంచి ధర పలుకుతుండటంతో టీడీపీ నాయకుడు అక్రమ తవ్వకాలకు పూనుకున్నాడు. రూ.లక్షల విలువ చేసే రాయిని తెలంగాణకు చెందిన కొందరు పెట్టుబడిదారులతో కలిసి తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అక్రమ బాగోతంపై కొందరు గ్రామస్తులు మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులు ఏమీ చేయలేరట!
వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్పై గ్రామస్తులు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు మరింతగా రెచ్చిపోయాడు. ‘అధికారులకు ముట్టజెప్పాల్సింది ముట్టజెప్పాం. అధికారంలో ఉంది మేమే. ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ టీడీపీ నేత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మురుగమ్మి కొండ ప్రాంతంలో వైట్ క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై మార్కాపురం మైనింగ్ ఏడీని వివరణ కోరగా.. ‘మాకు సంబంధం లేదు. ఫారెస్ట్ అధికారులదే బాధ్యత’ అని చెప్పారు.
అటవీశాఖతోపాటు బంజరు భూముల్లో అడ్డగోలుగా వైట్ క్వార్జ్ట్ మైనింగ్
కొండ ప్రాంతంలో మూడు జేసీబీలతో భారీ కందకాలు
మురుగమ్మి గ్రామ టీడీపీ నాయకుడే సూత్రధారి
వైట్ క్వార్జ్ట్ ముడి ఖనిజాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారుల మౌనం
గ్రామస్తుల వరుస ఫిర్యాదులతో ఆలస్యంగా తనిఖీ

మురుగమ్మి కొండ!

మురుగమ్మి కొండ!