
బడుగు యువకులపై దాడి మంత్రి మనోహర్ పనే..
ఒంగోలు వన్టౌన్: తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను దారుణంగా హింసించి, కర్కశంగా ప్రవర్తించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. యువకులను బహిరంగంగా లాఠీలతో మోది చిత్రహింసలు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ప్రదర్శన చేపట్టి, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత యువకులపై కూటమి ప్రభుత్వ మంత్రి నాదెండ్ల మనోహర్ దాడి చేయించారని ఆరోపించారు. తెనాలి ఐతా నగర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు మంత్రితోపాటు పొలీసు, మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలను దళితులు అడ్డుకున్నారన్నారు. మూడు రోజులపాటు దళితులు ఆందోళన చేయడంతో మంత్రి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో పొలీసులకు, దళితులకు మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని గుర్తుచేశారు. ఇది మనసులో పెట్టుకుని దళిత యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, కిరాతక పోలీసులు రాములు నాయక్, రమేష్ బాబును అరెస్టు చేయాలని, నాదెండ్ల మనోహర్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కోటిమాదిగ, మాల సంఘాల జేఏసీ నాయకులు టి.శోక్బాబు, కె.ఏడుకొండలు, కేవీపీఎస్ నాయకుడు రఘురాం తదితరులు పాల్గొన్నారు.
నాదెండ్లను బర్తరఫ్ చేయాలని దళిత సంఘాల డిమాండ్