
జిల్లాను సస్యశ్యామలం చేయాలి
● కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పెరివాల్
ఒంగోలు సబర్బన్: సవాళ్లను అధిగమించి జిల్లాను సస్యశ్యామలం చేసేలా పథకాలు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి వాగేష్ తివారీ, డాక్టర్ దినేష్ కుమార్ పెరివాల్ అన్నారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు కలెక్టర్తో కలిసి ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకరరావు జిల్లాలో జల్జీవన్ మిషన్ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డ్వామా పీడీ జోసఫ్కుమార్ మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితి, వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ నీటి మట్టాన్ని, పచ్చదనాన్ని పెంచేందుకు, నీటి వనరుల మరమ్మతులకు చేపట్టిన చర్యలు వివరించారు. గ్రౌండ్ వాటర్ ఈఈ విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో 93 గ్రామాలను పరిమితికి మించి భూగర్భ జలాలను వాడినట్లుగా గుర్తించామన్నారు. అయితే జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో భూగర్భ నీటిమట్టం ఏడాదిలోనే సగటున 3 మీటర్లు పెరిగిందన్నారు. దీనిపై వాగేష్ తివారీ స్పందిస్తూ జిల్లాలోని క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. డీపీఓ గొట్టిపాటి వెంకటనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.