
మహిళలు సమాజ చోదకులు
ఒంగోలు సబర్బన్: మహిళలు కుటుంబ, సమాజ చోదక శక్తిగా ఎదగాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బ్యాంకర్లు కూడా స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని కోరారు. డ్వాక్రా మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే వార్షిక రుణ, జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో డీఆర్డీఏ, మెప్మా అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 4.5 లక్షల మంది స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్తగా తయారు కావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీఆర్డీఏతో బ్యాంకర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బోగస్ గ్రూపులను, రుణాలు తీసుకోవడంలో డూప్లికేషన్ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులో 10 శాతం నిల్వ ఉంచి మిగతా నిధులను వారికే రుణంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేసే క్రమంలో జూన్ 5వ తేదీ నాటికి జిల్లాలో 1,720 యూనిట్లు అందుబాటులోకి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యమని చెప్పారు. ఇందుకుగాను రూ.23 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.6759.13 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. అనంతరం కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంజూరైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 2025–26 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ.. త్వరగా సబ్సిడీ క్రెడిట్ అయ్యేలా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు. డీఆర్డీఏ పీడీ నారాయణ మాట్లాడుతూ.. ఎస్హెచ్జీ మహిళలకు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు డీఆర్డీఏనే ష్యూరిటీ ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీహరి, డీపీఎంలు, ఏపీఎంలు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు సహకరించాలి డీఆర్డీఏ, మెప్మా, బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా