
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నాగులుప్పలపాడు: పిడుగు పడి గొర్రెల కాపరి మృతిచెందిన సంఘటన మండలంలోని ఈదుమూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, సమీపంలోని రైతులు తెలిపిన సమాచారం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి చీకటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు తీవ్రమైన గాలి వీస్తూ స్వల్పంగా వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడటంతో ఈదుమూడి–మట్టిగుంట గ్రామాల మధ్య భీమన్నకుంట సమీపంలో గొర్రెలు కాస్తున్న ఈదుమూడి గ్రామానికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన గతంలో ఓ ప్రమాదంలో తన చేతిని పోగొట్టుకుని దివ్యాంగుడయ్యాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.